మంత్రికి వీడియో ట్యాగ్‌.. నటి క్షమాపణలు

7 Jun, 2018 10:43 IST|Sakshi
షబానా అజ్మీ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియో కారణంగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ రైల్వే మంత్రిత్వ శాఖకు క్షమాపణలు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు.. మురికి నీటిలో భోజనం తినే ప్లేట్లను కడుగుతున్న 30 సెకన్ల వీడియోను చూసిన షబానా.. వారిని రైల్వే సిబ్బందిగా భావించారు. దాంతో వెంటనే ఆ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ, మంత్రి పీయూష్‌ గోయల్‌కు ట్యాగ్‌ చేసి.. ‘ఈ వీడియోను మీరొకసారి వీక్షించాల్సిందే’ అంటూ ట్వీట్‌ చేశారు.

షబానా ట్వీట్‌కు స్పందించిన రైల్వే శాఖ.. ‘మేడమ్‌ ఈ వీడియో ఒక మలేషియన్‌ రెస్టారెంట్‌లో.. మురికి నీళ్లలో ప్లేట్లను కడుగుతున్న వర్కర్లకు సంబంధించినదంటూ’.. అందుకు సంబంధించిన వార్తా కథనాన్ని కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

వెంటనే స్పందించిన షబానా.. ‘నా క్షమాపణలు స్వీకరించండి. పొరపాటును సరిదిద్దుకున్నానంటూ’ క్షమాణలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు... రైల్వే శాఖ షబానాపై పరువు నష్టం దావా వేయాలంటూ ట్రోల్‌ చేశారు. దీంతో మరోసారి ఆమె.. ‘మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానంటూ’ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు