ఆ వివాదంలోకి మహిళలను లాగడం ఎందుకు?

24 May, 2017 15:37 IST|Sakshi
ఆ వివాదంలోకి మహిళలను లాగడం ఎందుకు?

జమ్ము కశ్మీర్‌లో స్థానిక యువకుడికి బదులు అరుంధతీ రాయ్‌ని జీపుకు కట్టేసి ఉండాల్సిందంటూ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు షైనా ఎన్‌సీ ఖండించారు. ఈ వివాదంలోకి ఒక మహిళను లాగడం ఎందుకని, ఆమె సిద్ధాంతాలు ఎలాంటివైనా ఇలా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెప్పారు. పరేష్ రావల్‌కు తన అభిప్రాయం వెల్లడించే హక్కు ఉందని, కానీ మహిళలను ఇందులోకి లాగకుండా ఉంటే బాగుండేదని ఆమె చెప్పారు. అవతలి మహిళ ఎలాంటి సిద్ధాంతాలు పాటిస్తున్నా వాళ్లను అగౌరవపరిచేముందు ఆలోచించాలని షైనా అన్నారు.

అయితే, బీజేపీకే చెందిన మరోనాయకుడు ఎస్. ప్రకాష్ మాత్రం రావల్‌కు అండగా నిలిచారు. పలు విషయాలపై ఆయన ఎప్పుడూ ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తుంటారని, అందువల్ల దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దానిపై లేనిపోని వివాదాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. జమ్ము కశ్మీర్‌లో తమమీద పెట్రోలు బాంబులు, రాళ్లతో దాడులు చేస్తున్నవారిపై కాల్పులు జరపడానికి బదులుగా మానవకవచంగా రాళ్లు విసురుతున్న ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నందుకు మేజర్ లితుల్ గొగోయ్‌పై ఒకవైపు విమర్శలు వస్తుండగా మరోవైపు ఆర్మీ ఆయనను సమున్నతంగా గౌరవించింది. దీనిపై అరుంధతీ రాయ్ విమర్శించడంతో ఆ వ్యక్తికి బదులు అరుంధతీరాయ్‌ని కట్టేయాల్సిందని పరేష్ రావల్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు