మాజీ సీఎంపై శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

17 Aug, 2019 17:31 IST|Sakshi

నారాయణ్‌రాణె ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ

సాక్షి, ముంబై :  మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌రాణెపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివనేన నుంచి రాణె కాంగ్రెస్‌లో చేరడాన్ని పొరపాటు అనాలో లేక ఘోర తప్పిదం అనాలో చెప్పలేనని వ్యాఖ్యానించారు. నారాయణ్‌రాణె ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పవార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2005లో రాణె శివసేన నుంచి బయటికి వద్దామనుకున్నారు. అప్పుడాయనకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి ఎన్సీపీ. రెండోది కాంగ్రెస్‌. అయితే, ఆయన కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. అది పొరపాటు నిర్ణయమో. లేక తప్పిదమో చెప్పలేను’అన్నారు.

‘కాంగ్రెస్‌లో చేరితే సీఎం పదవి ఇస్తానన్నారని రాణె చెప్పారు. కానీ, అప్పుడే చెప్పాను. ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కాంగ్రెస్‌ నైజంలో లేదు అని. వినలేదు. ఎందుకంటే నా రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్‌లోనే గడిపాను కదా’అన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు. ఆవేశపరుడిగా పేరున్న రాణె కొంకణ్ ప్రాంతానికి చెందిన వారు. శివసేన పార్టీలోనారాయణ్‌రాణె చాలాకాలం పనిచేశారు.

బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో బాల్‌ థాకరే ఆయనకు 1999లో మహారాష్ట్ర సీఎంగా అవకాశమిచ్చారు. అయితే, రాజ్‌థాకరేకి పార్టీలో ప్రాధాన్యం పెరగడంతో నారాయణ్‌రాణె అసమ్మతి గళం వినిపించారు. దాంతో ఏడాది కాలానికే రాణె సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2005లో కాంగ్రెస్‌లో చేరి 12 ఏళ్లపాటు పనిచేశారు. అయితే, కాంగ్రెస్‌లో నాయకులతో ఆయనకు పొసగక పోవడంతో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్‌ అయ్యారు. సోనియా కనికరించడంతో తిరిగి పార్టీలో చేరారు. చివరికి ‘మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష’ పేరుతో 2018లో పార్టీ పెట్టారు.

మరిన్ని వార్తలు