కమెడియన్‌గా అలరించనున్న ఎంపీ శశిథరూర్‌

14 Nov, 2019 19:15 IST|Sakshi

ఢిల్లీ : రాజకీయాల్లో అపర మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ కమెడియన్‌గా అలరించనున్నారు. వినడానికి ఆశ్చర్యం కలిగించానా ఇది నిజం ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా థరూరే ట్విటర్‌లో వెల్లడించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమయ్యే 'వన్‌ మైక్‌ స్టాండ్‌' అనే కార్యక్రమంలో శశిథరూర్‌ స్టాండప్‌ కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక నిమిషం నిడివి ఉన్న ప్రివ్యూ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

'నేను ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని ఎక్కువదూరం ఆలోచించి చూస్తారు. నేను అందరిలానే  బాల్యంలో  ఒక సాధారణ జీవితాన్నే గడిపాను. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారి నుంచి ఆంగ్లం నేర్చుకోవాలని మా తల్లిదండ్రులు బలవంతపెట్టేవారు. కానీ అది నేను చెయ్యలేనని మా నాన్నకు చెప్పేవాడిని' అంటూ శశిథరూర్‌ వీడియోలో పేర్కొన్నారు. కాగా పూర్తి ఎపిసోడ్‌ నవంబరు 15న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

అయితే శశిథరూర్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోనూ ఆరు గంటల్లోనే  2లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియోలో శశిథరూర్‌ కామెడి టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాగా, వన్‌ మైక్‌ స్టాండ్‌ షోలో ఐదుగురు సెలబ్రిటీలతో పాటు ఐదుగురు ప్రొఫెషనల్‌ కమెడియన్లతో పోటీ పడనున్న శశిథరూర్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రాతో జతకట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలుగా తాప్సీ పన్ను, రిచా చద్దా, విషాల్‌ దడ్లానీ, భువన్‌ భమ్‌లు ఉండగా కమెడియన్ల జాబితాలో సపన్‌ వర్మ, రోహన్‌ జోషి, అంగద్‌ సింగ్, ఆశిశ్‌ సఖ్యాలు ఉన్నారు.


 

>
మరిన్ని వార్తలు