త్వరలో శతాబ్ది రైళ్ల చార్జీలు తగ్గింపు

26 Mar, 2018 02:39 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రద్దీ తక్కువగా ఉన్న మార్గాల్లో నడిచే శతాబ్ది ప్రీమియం రైళ్లలో చార్జీలను త్వరలో తగ్గించనున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి చెప్పారు. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ ప్రస్తుతం పనిచేస్తోందన్నారు. ఎక్కువ రద్దీలేని మార్గాల్లో నడుస్తున్న 25 శతాబ్ది రైళ్లలో చార్జీల్ని తగ్గించే అవకాశమున్నట్లు గుర్తించారు.

గతేడాది ఢిల్లీ–అజ్మీర్, చెన్నై–మైసూరుల మధ్య చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. బస్సులకు సమానంగా చార్జీలు తగ్గించడంతో ఈ మార్గాల్లో రైల్వే ఆదాయం 17 శాతం, ప్రయాణికుల బుకింగ్స్‌ 63 శాతం పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ చార్జీలు తగ్గించడంతోపాటు రైలు సర్వీసుల లే ఓవర్ టైం తగ్గించి 100 కొత్త రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇప్పటికే 25 నూతన రైళ్లు ప్రారంభించగా, ఈ ఏడాదిలోపు మరో 75 రైళ్లు ప్రారంభం కానున్నాయి.

వేగంగా ప్రయణించే 45 శతాబ్ది రైళ్లు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు