'సోదాలకు ఇది సరైన సమయం కాదు'

16 Dec, 2015 12:44 IST|Sakshi
'సోదాలకు ఇది సరైన సమయం కాదు'

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరోసారి ధిక్కారస్వరం వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయంపై సీబీఐ దాడులు చేయడాన్ని తప్పుపట్టారు. సీబీఐ సోదాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. దాడులు చేయాల్సిందిగా ఎవరు సలహా ఇచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో టైమ్ చాలా ముఖ్యమని, దాడులు చేసేందుకు ఇది కచ్చితంగా తగిన సమయం కాదని చెప్పారు. కేజ్రీవాల్కు పాపులారిటీనే కాదు మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అంటూ శత్రుఘ్న సిన్హా ప్రశంసించారు.

కాగా సీబీఐ దాడుల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై కేజ్రీవాల్ వాడిన భాషను శత్రుఘ్న సిన్హా తప్పుపట్టారు. మోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ నిందించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి  రాజేంద్ర కుమార్ ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో ఆప్, బీజేపీ నాయకుల మధ్య మాటలయుద్ధం  ముదిరింది.

మరిన్ని వార్తలు