‘బీజేపీలో వన్‌మ్యాన్‌ షో’

31 Mar, 2019 17:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించిన ఆ పార్టీ రెబెల్‌ ఎంపీ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్‌ గూటికి చేరడంపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ నిజమైన జాతీయ పార్టీగా వాస్తవిక దృక్పధంతో ఉన్నందున తమ కుటుంబ స్నేహితుడు లాలూ ప్రసాద్‌ సూచన మేరకు ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ,  బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి నేతలు తమ పార్టీల్లో చేరాలని తనను కోరినప్పటికీ తాను పట్నా సాహిబ్‌ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని చెప్పారు.

ఇక సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్న తనకు ఆ పార్టీని వీడటం బాధాకరమేనని, అయితే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, యశ్వంత్‌ సిన్హా వంటి దిగ్గజ నేతలను పార్టీ నిర్లక్ష్యం చేస్తున్న తీరు తనను బాధించిందని చెప్పుకొచ్చారు.బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోదీ, అమిత్‌ షాల నేతృత్వంలో ఆ పార్టీలో ఇప్పుడు నియంతృత్వం రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. వాజ్‌పేయి హయాంలో పార్టీలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే పద్ధతి ఉండేదని, ఇప్పుడు బీజేపీలో ఒన్‌ మ్యాన్‌ షో...టూ మాన్‌ ఆర్మీలా పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయోద్యమానికి కాంగ్రెస్‌ పార్టీ విశేష కృషిసాగించిందని, తాను కాంగ్రెస్‌లో చేరడానికి పలు కారణాలు ఉన్నాయని అన్నారు.

>
మరిన్ని వార్తలు