షీలా దీక్షిత్‌ అంత్యక్రియలకు సోనియా, అమిత్‌ షా

21 Jul, 2019 13:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ భౌతిక కాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో ఆమె పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో షీలా దీక్షిత్‌ భౌతిక కాయాన్ని సందర్శించిన సోనియా గాంధీ, ప్రియాంక గాం‍ధీ దివంగత నేతకు నివాళులు అర్పించారు.

షీలా దీక్షిత్‌ ఢిల్లీ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారని, ఆమె విలువైన సూచనలను తాను కోల్పోయానని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. కాగా షీలా దీక్షిత్‌ గుండెపోటుతో శనివారం ఉదయం ఫోర్టిస్‌ ఆస్పత్రిలో చేరగా వైద్యులు తీవ్రంగా శ్రమించినా  మరోసారి గుండె పోటు రావడంతో మధ్నాహ్నం 3.55 గంటలకు మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే అంత్యక్రియల్లో యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు