షిరిడీకి వెళ్లడం ఇక చాలా తేలిక

22 Sep, 2017 09:53 IST|Sakshi
షిరిడీకి వెళ్లడం ఇక చాలా తేలిక
సాక్షి, న్యూఢిల్లీ :షిర్డీకి వెళ్లే భక్తులకు శుభవార్త. సాయిబాబా దర్శనం చేసుకోవాలంటే గతంలో రైలు,బస్సు, ప్రైవేటు వాహనాల్లో షిర్డీకి వెళ్లాల్సి వచ్చేది. కానీ త్వరలోనే విమానంలోనూ షిర్డీకి వెళ్లొచ్చు. సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) గురువారం షిర్డీ ఎయిర్‌పోర్టుకు లైసెన్సు మంజూరు చేసింది. ఎయిర్‌బస్‌ ఏ-320, బోయింగ్‌ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అవసరమైనంత రన్‌వే ఉందని డీజీసీఏ తెలిపింది. రోజువారీ కార్యక్రమాల కోసం ప్రజల కోసం షిర్డీ ఎయిర్‌పోర్టుకు ఏరోడ్రోం లైసెన్స్ మంజూరు చేస్తున్నట్టు సీనియర్‌ డీజీసీఏ అధికారి చెప్పారు. కాక్డీ గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. రూ.350కోట్ల వ్యయంతో, 400హెక్టార్లలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు.
 
2011లోనే ఏవియేషన్‌ మంత్రిత్వ శాఖ ఈ ఎయిర్‌పోర్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అక్టోబర్‌ నుంచి ఈ విమానాలు సేవలు ప్రారంభమవనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. రోజుకు 500 మంది ప్యాసెంజర్లతో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లకు సేవలు ప్రారంభించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి టెంపుల్‌కు వెళ్లడానికి బస్సు లేదా ట్యాక్సీ సర్వీసులను అందించనున్నారు. షిర్డీ టెంపుల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. 
మరిన్ని వార్తలు