మోదీజీ..కొలువులు ఎక్కడ..?

3 Jun, 2019 12:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం, వృద్ధి రేటు మందగించడంపై బీజేపీ మిత్రపక్షం శివసేన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నూతన ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని శివసేన సూచించింది. నిరుద్యోగం, ధరల పెరగుదల, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు ఎదురయ్యే ప్రధాన సవాళ్లని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది.

దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీని నిందించరాదన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వాదనతో శివసేన అంగీకరించినా దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి తెస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇవ్వడాన్ని మరువరాదని గుర్తుచేసింది. మోదీ చెప్పినట్టుగా ఇప్పుడు పది కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉండగా అది జరగలేదని, దీనికి నెహ్రూ-గాంధీ కుటుంబాలను ఎలా విమర్శిస్తారని సంపాదకీయం పేర్కొంది.

ఇక ప్రభుత్వ కొలువుల్లో నియామకాలు 30 నుంచి 40 శాతం మేర పడిపోయాయని, 2016-17లో కేవలం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేశారని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో లోపాలను చక్కదిద్ది ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చొరవ చూపాలని సేన సంపాదకీయం పేర్కొంది.

మరిన్ని వార్తలు