కోవిడ్‌-19 : వంద రోజులు దాటినా తగ్గని ఉధృతి

7 Jul, 2020 14:56 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌ కట్టడిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని మహారాష్ట్ర పాలక పార్టీ శివసేన ఆరోపించింది. కోవిడ్‌-19పై పోరులో 21 రోజుల్లో విజయం సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారని, 100 రోజులు దాటినా మహమ్మారి మరింత విజృంభిస్తోందని మండిపడింది. కరోనా వైరస్‌ను 21 రోజుల్లో అంతం చేస్తామని మోదీ చెప్పారని, 100 రోజులు దాటినా అది అంతం కాకపోగా దానితో పోరాడేవారు అలిసిపోయారని శివసేన తన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఎద్దేవా చేసింది. 2021లోగా ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేకపోవడంతో కోవిడ్‌-19 అప్పటివరకూ కొనసాగుతుందని పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న మూడవ దేశంగా భారత్‌ నిలవడం పట్ల శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరే భారత్‌లో 24 గంటల్లో 25,000కు పైగా కరోనా కేసులు నమోదవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తాజా పాజిటివ్‌ కేసులు ఇలాగే పెరిగితే ప్రపంచంలోనే కోవిడ్‌-19 కేసుల్లో భారత్‌ అగ్రస్ధానానికి చేరుకుంటుందని పేర్కొంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ రోగులు పెద్దసంఖ్యలో కోలుకుంటున్నారని కరోనా హాట్‌స్పాట్స్‌లో కేసులు పెరగడం ఆందోళనకరమని తెలిపింది. లాక్‌డౌన్‌ ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది.

చదవండి : ఆ సిటీల్లో కోవిడ్‌-19 అలజడి..

మరిన్ని వార్తలు