డ్రామాలాడి తమ్ముడిని బలిపశువును చేశారు

18 Sep, 2016 16:45 IST|Sakshi
డ్రామాలాడి తమ్ముడిని బలిపశువును చేశారు

శహరాన్పూర్: సమాజ్వాది పార్టీ కుటుంబ కుంపట్లో అగ్గి చల్లారేలా లేదు. ఎలాగో సర్దుమణిగిందనుకున్న వ్యవహారాన్ని సొంతపార్టీ నేతలే కాకుండా ప్రతి పక్ష పార్టీలు సైతం రెచ్చగొట్టి మరోసారి వారి కుటుంబంలో అగ్గి రాజేస్తున్నాయి. పార్టీ పగ్గాలు అఖిలేశ్ కే ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేసి శివపాల్ కు ఆగ్రహం తెప్పించగా తాజాగా మాయావతి వ్యాఖ్యలు కూడా ఆయనను మరోసారి ఆలోచనలో దించేలా ఉన్నాయి. ఆదివారం పార్టీ నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో సమాజ్ వాది పార్టీపై బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఎస్పీ పగ్గాలు శివ్ పాల్ యాదవ్ చేతికి ఇచ్చి ఆయనను బలిపశువును చేశారని ఆరోపించారు. కావాలనే ఎస్పీ అధినేత ములాయం ఈ డ్రామాలు ఆడారని, తన కుమారుడి ప్రతిష్టను కాపాడుకునేందుకు సోదరుడు శివపాల్ ను బలిపశువును చేశారని అన్నారు. 2017 ఎన్నికల్లో ఎలాగో ఎస్పీ ఓడిపోతుందని ముందే ఊహించిన ములాయం తెలివిగా పార్టీ పగ్గాలు శివపాల్ చేతిలో పెట్టాడని ఘాటుగా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్పీ హయాంలో శాంతి భద్రతల పరిస్థితులు చాలా దారుణంగా దిగజారిపోయాయని, ప్రజలంతా ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు