‘భయపడకండి.. పులి బతికే ఉంది’

20 Dec, 2018 12:15 IST|Sakshi

భోపాల్ ‌: ఎవరూ భయపడకండి.. పులి బతికే ఉంది అంటున్నారు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. పులి బతికి ఉండటానికి.. చౌహాన్‌కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎక్కడైనా ఓడిపోయిన వారికి ధైర్యం చెబుతారు. కానీ చౌహాన్‌ మాత్రం వెరైటీగా ప్రజలకు ధైర్యం చెబుతూ తనను తాను పులిగా చిత్రికరించుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి బుధ్ని నియోజకవర్గంలో పర్యటించిన చౌహాన్‌ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఎవరు భయపడకండి.. మీకు ఏం కాదు. నేకు ఇక్కడే ఉన్నాను. పులి ఇంకా బతికే ఉందం’టూ సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ జిందా హై’ సినిమా డైలాగ్‌లు చెప్పారు.

అయితే ఇలా చమత్కారంగా మాట్లాడటం చౌహాన్‌కు కొత్తేం కాదు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘తుమ్‌ తో ఠహరే పర్దేసీ సాథ్‌ క్యా నిభాఓగే’ అంటూ పాత హిందీ సినిమా పాట పాడుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని విదేశీయుడంటూ ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పూర్తి బాధ్యత తనదేనంటూ చౌహాన్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు