పోలీసు అధికారిపై బదిలీ వేటు!

23 Jul, 2018 15:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సాధ్వీతో హీలింగ్‌ చేయించుకుంటూ, దీవెనలు పొందుతున్న ఫొటో వైరల్‌ కావడంతో పోలీసు అధికారిని బదిలీ చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనక్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇందర్‌ పాల్‌... సాధ్వీగా పేరొందిన నమితా ఆచార్యను స్టేషన్‌కు పిలిపించారు. ఇందర్‌పాల్‌ తలపై నమిత ఆచార్య చేయి ఉంచగా.. అతడు సేద తీరుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారడంతో.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీసులే ఇలా ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే యూనిఫాంలో ఇలా చేయడమేమిటని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన ఉన్నతాధికారులు.. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇందర్‌ పాల్‌ను ఆదేశిచండంతో పాటు విజిలెన్స్‌ ఎంక్వైరీని కూడా ఏర్పాటు చేశారు. అతడిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనకు తాను దేవీమాతగా చెప్పుకునే నమితా ఆచార్య ఇదివరకు కూడా పలువురు ప్రభుత్వాధికారుల కార్యాలయాలకు వెళ్లి మరీ  హీలింగ్‌ చేసేవారు. వారిలో ఎక్కువగా ఐపీఎస్‌ అధికారులే ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు