కాల్పులు జరిపి దోపిడీ.. వైరల్ వీడియో

19 Mar, 2017 19:25 IST|Sakshi
కాల్పులు జరిపి దోపిడీ.. వైరల్ వీడియో

భువనేశ్వర్: కొందరు గుర్తుతెలియని దుండగులు తుపాకులతో బెదిరించి, మేనేజర్ పై కాల్పులు జరిపి రూ.2 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒడిషాలోని అంగల్ జిల్లా పరాంగ్లో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు పరాంగ్ లోని ఓ పెట్రోల్ బంకుకి తుపాకులతో దోపిడీకి వచ్చారు. ఓ వ్యక్తి మేనేజర్ రూమ్ బయట ఉండగా మరో ఇద్దరు లోపలికి వెళ్లారు. అందులో ఓ వ్యక్తి చేతిలో తుపాకీ ఉంది. డబ్బు ఎక్కడ ఉందని దుండగులు మేనేజర్ జితేంద్ర బెహరాను ప్రశ్నించారు.

డబ్బు లేదని మేనేజర్ చెప్పడంతో ఆయనపై ఓ దుండగుడు ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. మేనేజర్ చెప్పగానే మరో ఉద్యోగి మొదట కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత మనేజర్ కూడా డెస్క్ లో దాచిన మరికొంత నగదును దుండగులకు ఇచ్చేశాడు. తుపాకీ గురిపెట్టి చంపేస్తామని బెదిరించడంతో డబ్బు ఇవ్వక తప్పలేదని గాయపడ్డ మేనేజర్ జితేంద్ర పోలీసులకు తెలిపారు. రూ.2 లక్షలకు పైగా నగదును దోపిడీదారులు దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ కుడికాలిలో బుల్లెట్ గాయం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ రూములో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.