న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్ లో ఓ సంఘటన పలువురిని విస్మయ పర్చింది. ఓ 16 ఏళ్ల అమ్మాయి కేశవ్ పురం మెట్రో స్టేషన్ టాయిలెట్ లో చనిపోయిన పిండానికి జన్మనివ్వడం కలకలం రేపింది. అపస్మారక స్థితిలో వున్న ఆ బాలికను మెట్రో స్టేషన్ వైద్య సిబ్బంది, రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉద్యోగం పేరుతో మైనర్ బాలికను మభ్యపెట్టి లైంగికదాడికి పూనుకోవడమే కాకుండా, బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన వైనం వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగం ఆశచూపిన గుల్షన్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం తనను లొంగదీసుకున్నాడని బాధితురాలు వాపోయింది. తనను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడని ఆరోపించింది. అయితే గర్భవతినని తెలియగానే అబార్షన్ చేయించడానికి వెళుతుండగా... తాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గుల్షన్, అతని స్నేహితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులపై లైంగిక దాడి, విమెన్ ట్రాఫికింగ్ అభియోగాలు కింద కేసు నమోదు చేశామన్నారు.