ఆమెను కలుసుకోవాలని ఉంది: శ్రేయా

8 Jul, 2015 21:24 IST|Sakshi
ఆమెను కలుసుకోవాలని ఉంది: శ్రేయా

ముంబై: తన అద్భుత గాత్రంతో యూట్యూబ్ సహా సోషల్ మీడియా అంతటా సంచలనం సృష్టిస్తోన్న అంధ విద్యార్థిని తుంపా కుమారికి ఓ విశిష్ట వ్యక్తి నుంచి పిలుపొచ్చింది.

'ఆశికీ- 2' సినిమాలో తాను పాడిన 'సున్ రహా..' పాటను తన కంటే అందంగా ఆలపించిందంటూ గాయని శ్రేయా ఘోషాల్ బాలికకు కితాబిచ్చింది. అంతేకాదు.. 'ఆమె ఎవరు? ఎక్కడుంటుంది? తొందరగా కలుసుకోవాలని ఉంది..' అంటూ ఫేస్బుక్ ద్వారా ఆహ్వానం పలికింది.

జార్ఖండ్లోని బ్రజ్కిశోర్ అంధుల పాఠశాలలో చదువుతున్న తుంపా కుమారి అనే ఈ చిన్నారి.. బాలీవుడ్ సింగర్లందరూ అచ్చెరువొందేలా పాడిన పాట నెట్లో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పాటలోని ఆరోహణ.. అవరోహణలను అవలీలగా ఆమె పాడిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలోని గమకాలను అలవోకగా ఆమె ఆలపించింది.

సినిమాలో శ్రేయాఘోషల్ పాడిన ఈ పాటను చిన్న బాలిక పాడటం చూసి నెట్ ప్రపంచం ఆమెకు జోహార్లంటోంది.  ఎవరైనా సంగీత దర్శకుల దృష్టికి ఈమె టాలెంట్ వెళ్తే మాత్రం.. తిరుగులేకుండా ఆమె దేశం గర్వించదగ్గ గాయని అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల్లో కూడా 'మీరు చేస్తున్న పని తక్షణం ఆపేసి.. ఈ వీడియో చూడండి. ఈ పాప పాడిన పాట చూస్తే, బాలీవుడ్ సింగర్లంతా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే' అన్న సందేశంతో పాటుఈ వీడియో షేర్ అవుతోంది.

మరిన్ని వార్తలు