కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం

20 Mar, 2020 17:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా  పాకాయి. కనికా కపూర్‌ తనకు  కోవిడ్‌-19 (కరోనా) పాజిటివ్‌ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ఫ్‌ నిర్బంధంలోకి పోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.  దీంతో కరోనా తుట్టె కదిలింది. పలువురు ఎంపీలు సహా,  కనికాతో కలిసిన, సన్నిహిత మెలిగిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోవాల్సిన  పరిస్థితి  ఏర్పడింది. 

వివరాలను పరిశీలిస్తే..కనికాకపూర్‌ ఏర్పాటు చేసిన పార్టీకి రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌, ఆయన సన్నిహిత బంధువులు హజరయ్యారు. దీంతో కనికాకపూర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుసుకున్నఎంపీ దుష్యంత్‌ సింగ్‌ సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌ విధించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.  మరోవైపు  ఇంటికే పరిమితమైనట్టు ఆయన తల్లి వసుంధరా రాజే కూడా ట్విటర్‌లో ప్రకటించారు.

మరోవైపు తాజాగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకున్న దుష్యంత్‌ లోక్‌సభ సమావేశాలకు హాజర​య్యారు. దీంతో ఆయన సమీపంలోనే  కూర్చునే టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌ కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకుంటున్నట్టు ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ఈ ప్రభుత్వం మనందరినీ ప్రమాదంలో పడేస్తోంది. స్వీయ నిర్బంధం అవసరమని స్వయంగా  ప్రధాని చెప్పారు, కానీ పార్లమెంటు కొనసాగుతోందని ఆయన విమర్శించారు.  దుష్యంత్ పక్కన రెండున్నర గంటలు నేను కూర్చున్నాను. మరో ఇద్దరు ఎంపీలు సెల్ఫ్‌ క్వారంటైన్‌లొ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైనా పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాదు దుష్యంత్‌ సింగ్‌ దేశ అధ్యక్షుడు రామనాథ్‌ కోవింద్‌ను కూడా కలిసారన్న అంచనాలు మరింత కలకలం రేపుతున్నాయి. వీరితోపాటు పార్లమెంటు ఆవరణలో పోలీసు అధికారులు, ఇతర సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆందోళన చెందుతున్నారు.

కాగా కనికా కపూర్‌ మార్చి 15 న లండన్‌ నుంచి లక్నోకు చేరుకున్న తర్వాత తన కుటుంబసభ్యులు, స్నేహితులకు ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి పలువురు రాజకీయనాయకులు, సామాజిక వేత్తలు దాదాపు 100 మంది హాజరయ్యారు. దీంతో కనికా కపూర్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. 

While in Lucknow, I attended a dinner with my son Dushyant & his in-laws. Kanika, who has unfortunately tested positive for #Covid19 was also a guest.

As a matter of abundant caution, my son & I have immediately self-quarantined and we’re taking all necessary precautions.

మరిన్ని వార్తలు