‘పనామా’పై సిట్ సమీక్ష

27 Apr, 2016 01:08 IST|Sakshi

న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలికితెచ్చే విషయమై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం సమావేశమైంది. పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసులను సమీక్షించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘పనామా పేపర్స్’పై ప్రధానంగా చర్చించింది. సిట్ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) ఎంబీ షా నేతృత్వంలో జరిగిన భేటీలో ‘పనామా పేపర్స్’పై ఆదాయ పన్ను శాఖ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమర్పించిన నివేదికలపై సమీక్ష నిర్వహించారని అధికారులు తెలిపారు.

పనామా పేపర్స్, రూ. 6 వేల కోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా (ఢిల్లీ బ్రాంచ్) స్కాం కేసుల రికార్డులు, స్థాయీ నివేదిక సమర్పించిన దర్యాప్తు సంస్థలు.. తాము తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దాదాపు 500 మంది భారతీయుల పేర్లున్న పనామా పేపర్స్ జాబితా లీకేజీ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్, ఓ జాతీయ దినపత్రిక  వెలువరించిన  సమాచారం ఆధారంగా దర్యాప్తు చేయాలని పలు  దర్యాప్తు సంస్థలను సిట్ ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు