జమ్ము కశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితి..

18 Aug, 2019 17:04 IST|Sakshi

శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దుతో అలజడి రేగిన జమ్మూ కశ్మీర్‌లో క్రమంగా తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గువాల మెరుగైన వ్యూహాలతో కొద్దిరోజుల్లోనే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్నారు.

కశ్మీర్‌లోయలో సోమవారం నుంచి పాఠశాలలు, విద్యాసంస్ధలు తెరుచుకోనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రం ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం ప్రకటించిన వెంటనే జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము దీటైన వ్యూహాన్ని రూపొందించి అమలు చేశామని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్య పాల్‌ మాలిక్‌ సలహాదారు కే విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

సమస్యలను సృష్టించే వారిని గుర్తించి నిర్భందంలోకి తీసుకోవడం తమకు ఎదురైన ప్రధాన సవాల్‌గా ఆయన చెప్పుకొచ్చారు. సోషల్‌ మీడియా వేదికలపై దుష్ప్రచారం సాగించే వారిపై కఠినంగా వ్యవహరించామని అన్నారు. ఉగ్ర సంస్ధల్లో యువత నియామకాలను నిరోధించేందుకు వారి కోసం అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.

మరిన్ని వార్తలు