ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర ప్రమాదం

5 Nov, 2017 13:31 IST|Sakshi

ఆగ్రా : ఉత్తర ప్రదేశ్‌లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్‌ హైవేపై కన్నౌజ్‌ ప్రాంతం వద్ద ఓ కారు ప్రమాదానికి గురికాగా అందులోని ఆరుగురు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఇద్దరు మైనర్లు(2,3 ఏళ్లు) కూడా ఉండటం శోచనీయం.

అర్థరాత్రి 2గం 15 ని. ప్రాంతంలో హుషేపూర్‌ గ్రామం వద్దకు చేరుకుంది. డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన కారు పల్టీలు కొడుతూ చాలా దూరం వెళ్లింది. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోని వారు దహనం అయ్యారు.  వారంతా బిహార్‌ ఛ్చాత్‌ వేడుకల్లో పాల్గొని తిరిగి మిథాపూర్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో వినయ్‌ కుమార్‌, అభయ్‌ కుమార్‌లను మాత్రమే గుర్తించగలిగారు. మిగతా వారి దేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని తెలిపారు. 

అతి వేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు. ఇక ఘటనా స్థలానికి మొదటగా చేరుకున్న కానిస్టేబుల్‌ ముకుత్‌ అక్కడి భయానక దృశ్యాల గురించి వివరించారు. ‘‘నేను వెళ్లే సరికి ఓ చిన్నారి మృతదేహం కారు టైర్‌ కింద కాలుతూ కనిపించింది. కారు లోపల కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు బూడిదగా మారిపోయి ఉన్నారు‘‘ అని ఆయన తెలిపారు. వినయ్‌ కుమార్‌, అభయ్‌ కుమార్‌లు సాకీత్‌ ప్రాంతంలో నగల షాపును నిర్వహిస్తున్నారని తేలింది. గోపాల్‌గంజ్‌లోని తమ స్నేహితుల వద్దకు వెళ్లి ఛ్చాత్‌ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగినట్లు వారి తాత విక్రమా సింగ్‌ తెలిపారు.  మిగతా వారిని గుర్తించాల్సి ఉంది.

 ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు సజీవ దహనం 

మరిన్ని వార్తలు