కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. 6గురు ఉగ్రవాదుల హతం

22 Dec, 2018 12:51 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఉదయం కశ్మీర్‌ పుల్వామా జిల్లా ట్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను అంతమొందించారు. చనిపోయిన వారంతా మాజీ హిజ్బుల్‌ చీఫ్‌ జాకీర్‌ ముసా అన్సార్‌కు చెందిన ‘ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌’ ముఠాకు చెందిన వారని తెలిసింది.  మరణించిన వారిలో జాకీర్‌ ముసా ముఖ్య అనుచరుడు సోలిహా మహ్మద్‌ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

వివరాల ప్రకారం దద్సారా ప్రాంతంలోని ఆరమ్‌పోరా కుగ్రామంలో ఉగ్రవాదుల ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దాంతో కార్డన్‌ సర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా.. ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల జరిపిన భద్రతా సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి  అధికారులు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు