యోగా మానేసి అమ్మ వద్దకు ప్రధాని

10 Jan, 2017 09:21 IST|Sakshi
యోగా మానేసి అమ్మ వద్దకు ప్రధాని

గాంధీనగర్: సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రతిరోజు చేసే యోగాను నేటి ఉదయం మాత్రం స్కిప్ చేశానని మోదీ ట్వీట్ చేశారు. తన తల్లి హీరాబెన్‌ను కలుసుకునేందుకు వెళ్లానని, ఆమెతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశానని ట్వీట్లో పేర్కొన్నారు. తల్లితో కలిసి సమయాన్ని గడపడంపై ఆయన ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. గత డిసెంబర్‌లో చివరిసారిగా గుజరాత్‌లోని దీసాలో ర్యాలీ, పార్టీ సమావేశాల్లో పాల్గొన్న సందర్బంగా తల్లిని కలుసుకున్న విషయం తెలిసిందే.

మోదీ తల్లి హీరాబెన్ ప్రస్తుతం గాంధీనగర్ శివారులో ఆయన సోదరుడు పంకజ్ మోదీ ఇంట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా తనకు వీలు చిక్కడంతో సోదరుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో పాటు తల్లి హీరాబెన్‌ను ఆప్యాయంగా పలకరించారు. తల్లితో కలిసి విలువైన సమయాన్ని గడిపానని మోదీ చెప్పారు. కాగా, నేటి నుంచి మూడు రోజులపాటు గాంధీనగర్‌లో జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సును మోదీ ప్రారంభించనున్నారు. ఈ భారీ సదస్సుకు దాదాపు 500 సంస్థల సీఈవోలు హాజరు అవుతారు. సోమవారం గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌లో రూ.250 కోట్లతో పునర్నిర్మాణ పనులకు మోదీ సోమవారం శంకుస్థాపన చేసిన మోదీ నేడు పలు కార్యక్రమాలకు హాజరై ప్రసంగించనున్నారు.

మరిన్ని వార్తలు