సాక్షి, న్యూఢిల్లీ : మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళను తాకాయని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ తెలిపింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయని స్కైమెట్ పేర్కొనగా మే 29న రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది.
కేరళలో రుతుపవనాల రాకకు సానుకూల వాతావరణం నెలకొందని, ఈ ఏడాది వర్షాకాలం ఆరంభమైందని స్కైమెట్ సీఈఓ జతిన్ సింగ్ చెప్పారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన అనంతరం దక్షిణ అరేబియా సముద్రం, తమిళనాడు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అడిషనల్ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.