థాక్రే చెంపపై కొడితే రూ.2 లక్షలు

27 Nov, 2015 20:42 IST|Sakshi
థాక్రే చెంపపై కొడితే రూ.2 లక్షలు

చెన్నై: దేశ ప్రజల్లో సహనం నశిస్తోందంటూ బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే చెంపమీద కొడితే బహుమతిని ఇస్తామని తమిళనాడు తవ్‌హీద్ జమాత్ శుక్రవారం ప్రకటించింది. బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్ ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ దేశ ప్రజల్లో సహనం నశిస్తోంది, అభద్రతా భావం పెరిగిపోతోంది, విదేశాలకు వెళ్లిపోవడం మేలని తన భార్య చెబుతోందని అన్నారు.

ఈ వ్యాఖ్యలకు ఒకవైపు నిరసన, మరోవైపు హర్షాతిరేకాలు వెలువడ్డాయి. ఆమిర్‌ ఖాన్‌ను చెంపదెబ్బ కొడితే రూ.లక్ష ఇస్తామని శివసేన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు తమిళనాడు తవ్‌హీద్ జమాత్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే చెంపపై కొట్టినవారికి రూ.2 లక్షలు బహూకరిస్తామని పేర్కొంటూ జమాత్ సహాయ ప్రధాన కార్యదర్శి తవ్‌బీక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శివసేన చేస్తున్న ప్రకటనలకు బెదిరిపోమని, మతఛాందసవాదులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు