బంగారం బిస్కెట్లు స్వాధీనం

23 Jul, 2017 20:20 IST|Sakshi

చెన్నై: శ్రీలంక నుంచి సముద్రమార్గం గుండా చెన్నైకి తరలిస్తున్న కేజీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు ఆదివారం తమిళనాడులోని సాయల్‌కుడిలో పట్టుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. రామనాథపురం-శివంగంగై-తూత్తుకుడి సముద్ర తీర సరిహద్దు గ్రామాల ద్వారా శ్రీలంక నుంచి ఇటీవల కాలంలో బంగారం తమిళనాడులోకి ప్రవేశిస్తున్నట్టు నిఘా వర్గాల విచారణలో తేలింది. శనివారం రాత్రి తమకు అందిన సమాచారం మేరకు రామనాథపురం జిల్లా సాయల్‌కుడి మార్గంలో కస్టమ్స్ అధికారులు, పోలీసులు నిఘా వేసి వాహనాలు తనిఖీలు చేశారు.

ఆదివారం వేకువజామున అటువైపు వచ్చిన నాలుగు మోటార్‌ సైకిళ్లను తనిఖీ చేశారు. వాటిలో చిన్నపాటి పార్సిల్స్‌లో ఒక కేజీ బరువు కలిగిన పది బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. వీటిని చెన్నైకి తరలించి ఇక్కడి నుంచి హవాలా రూపంలో తిరిగి శ్రీలంకకు నగదు రూపంలో చేర్చేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో చెన్నైలో బంగారాన్ని హవాలా నగదుగా మార్చే పనిలో పడ్డ ఓ బడా బాబు కోసం వేట మొదలెట్టారు.

మరిన్ని వార్తలు