-

చీటింగ్‌ ఆరోపణలపై స్పందించిన సోనాక్షి బృందం

25 Feb, 2019 14:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈవెంట్‌లో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో హాజరయ్యేందుకు నిరాకరించారంటూ ఓ ఈవెంట్‌ నిర్వాహకుడి ఫిర్యాదుతో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సహా మరో నలుగురిపై చీటింగ్‌ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అయితే తాము ఎన్ని సార్లు గుర్తు చేసినా సోనాక్షికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని ఈవెంట్‌ నిర్వాహకుడిపై సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఆరోపించింది.

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈవెంట్‌లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పలుమార్లు గుర్తుచేసినా నిర్వాహకులు సోనాక్షికి డబ్బు చెల్లించకపోవడంతో పాటు చివరికి తప్పుడు ప్రచారం చేసుకునేందుకు వారు ప్రస్తుతం మీడియాను వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించకపోవడంతో పాటు ఈవెంట్‌ ముగియగానే సోనాక్షి, ఆమె బృందానికి తిరుగు ప్రయాణం టికెట్లు పంపలేదని సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.

నిర్వాహకులు స్పందించకపోవడంతో సోనాక్షి, ఆమె బృందం ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెనుతిరిగిందని సోనాక్షి ప్రచార వ్యవహారాలు పర్యవేక్షించే ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈవెంట్‌ను మరోసారి నిర్వహించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలపై పలుసార్లు నిర్వాహకులతో తాము కోరినా వారి నుంచి స్పందల లేదని సోనాక్షి మేనేజ్‌మెంట్‌ టీం ఆవేదన వ్యక్తం చేసింది.తమపై దుష్ర్పచారం మానకుంటే సోనాక్షి సహా ఆమె బృందం చట్టపరమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది

మరిన్ని వార్తలు