సోనియాకు అస్వస్థత

23 Mar, 2018 12:23 IST|Sakshi
షిమ్లాలో కొత్తగా నిర్మిస్తున్న తన నివాసం వద్దకు కూతురు ప్రియాంకగాంధీతో కలిసి వెళుతున్న సోనియాగాంధీ (ఫైల్‌ ఫొటో)

షిమ్లా : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అస్వస్థతకు లోనయ్యారు. ఉన్నపలంగా ఆమె షిమ్లా నుంచి ఢిల్లీకి వచ్చారు. సోనియాకు ఒంట్లో కొంత వ్యాకులతగా అనిపించడంతో అంబులెన్స్‌ రావడానికంటే ముందే తన సొంతకారులో బయల్దేరారు. షిమ్లాలోని చరబ్రాలో సోనియాగాంధీ నివాసం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ పనులు పర్యవేక్షించేందుకు సోనియా అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆమెతో కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

అయితే, ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీ (ఐజీఎంసీ) సీనియర్‌ మెడికల్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ రమేశ్‌ చంద్ తెలిపిన ప్రకారం సోనియాకు కొంత నీరసంగా ఉందని, ఆమె వెంటనే ఢిల్లీ బయలుదేరి రావాల్సిన అవసరం ఉందని, అందుకోసం అంబులెన్స్‌ పంపించాలని ఆమె పక్కన ఉన్న వైద్యుడు ఫోన్‌ చేశారు. అయితే, కొందరు వైద్యుల బృందంతో కూడిన అంబులెన్స్‌ వచ్చేలోగానే ఆమె కారులో బయలుదేరారు. దీంతో ఆమెకోసం వచ్చిన అంబులెన్స్‌ కూడా కారు వెనుకే వెళ్లింది. కాగా, మార్గం మధ్యలో ఆమె ఓసారి పంచకులలో ఆగినట్లు డాక్టర్‌ చంద్‌ వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు