లౌకికత్వం కోసం పోరాడారు

20 Nov, 2017 03:03 IST|Sakshi

ఇందిర శత జయంతి సందర్భంగా సోనియా

న్యూఢిల్లీ: ప్రజలను, దేశాన్ని కులమతాల పేరుతో విభజించాలనుకున్న వారికి వ్యతిరేకంగా, లౌకికవాదం కోసం దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోరాడారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇందిర శత జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలు, జీవన విధానంపై ఆదివారం ‘ఎ లైఫ్‌ ఆఫ్‌ కరేజ్‌’ పేరుతో ఢిల్లీలో చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సోనియా మాట్లాడుతూ ‘ఇందిరను కొందరు ఉక్కు మహిళగా అభివర్ణించడాన్ని నేను విన్నాను. ‘ఉక్కు’ అనేది ఆమె వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. మానవత్వం, ఉదారత అనేవి ఆమెకున్న అనేక సద్గుణాలలో కొన్ని’ అని పేర్కొన్నారు. .

ప్రముఖుల నివాళి...
ఇందిర జయంతి సందర్భంగా ఆదివారం  ప్రముఖులు నివాళులర్పించారు. ‘జయంతి సందర్భంగా ఇందిరా గాంధీని జాతి స్మరిస్తోంది’ అని రాష్ట్రపతి కోవింద్‌ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ ఓ ట్వీట్‌తో ఇందిరకు నివాళి అర్పించారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులోనూ లోక్‌సభ స్పీకర్‌ మహాజన్, బీజేపీ నేత ఆడ్వాణీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్‌æ తదితరులు నివాళులర్పించారు. ఇందిర సమాధి ‘శక్తి స్థల్‌’ వద్ద ప్రణబ్, మన్మోహన్, రాహుల్‌గాంధీ  పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. ఇందిర దేశానికి అమ్మ అని బీజేపీ ఎంపీ, ఇందిర మనవడు వరుణ్‌ గాంధీ శ్లాఘించారు.

మన్మోహన్‌కు శాంతి బహుమతి...
ఈ ఏడాదికి ‘ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి’ బహుమతిని మాజీ ప్రధా ని మన్మోహన్‌ అందుకోనున్నారు. 2004 –14 మధ్య దేశాభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఆయనను ఈ బహుమతికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

మరిన్ని వార్తలు