ప్రతికూల రాజకీయాలపై కాంగ్రెస్‌ విజయం: సోనియా

12 Dec, 2018 13:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూడు కీలక హిందీ రాష్ట్రాల్లో పార్టీ గెలుపు బీజేపీ ప్రతికూల రాజకీయాలపై కాంగ్రెస్‌ విజయంగా యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ బుధవారం అభివర్ణించారు. రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాలక బీజేపీని మట్టికరిపించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ  విజయానికి కృషి చేసిన కార్యకర్తలను సోనియా అభినందించారు.

మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ పార్టీ సీనియర్‌ నేతలు కమల్‌ నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌, జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్ర గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ను కలిశారు. బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ను సాధించిన కాంగ్రెస్‌ తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. ఇద్దరు బీఎస్పీ సభ్యులతో పాటు పార్టీ రెబెల్స్‌గా గెలుపొందిన ఎమ్మెల్యేలు సైతం తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతారని ఆ పార్టీ భావిస్తోంది. రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ సీఎం అభ్యర్ధులను పార్టీ హైకమాండ్‌ ఖరారు చేయనుంది.

మరిన్ని వార్తలు