కోల్‌కతా పోలీసుపై ప్రశంసలు కురిపిస్తున్న గంగూలీ

22 May, 2020 12:15 IST|Sakshi

కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఓ కోల్‌కతా పోలీసుపై ప్రశంసల వర్షం కురుపిస్తున్నాడు. దేశమంతా కరోనా వైరస్‌తో భయపడుతుంటే.. పశ్చిమ బెంగాల్‌ను మాత్రం ఉంపన్‌ తుపాను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుపాను ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు కూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ పోలీసు అధికారి స్థానికులతో కలిసి ఆ చెట్లను పక్కకు లాగుతున్నాడు. రెండు రోజుల క్రితం కోల్‌కతా సౌత్‌ ఈస్ట్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇప్పటికే పలువురు ప్రశంసలు పొందిన ఈ వీడియోను చూసిన గంగూలీ ‘కోల్‌కతా పోలీసులను చూసి ఎంతో గర్విస్తున్నాం’ అని ప్రశంసిస్తూ మరో సారి రీట్వీట్‌ చేశాడు. (ఉంపన్‌.. కోల్‌కతా వణికెన్‌)

ఉంపన్‌ ధాటికి రాష్ట్ర రాజధాని కోల్‌కతా చిగురుటాకులా ఒణికిపోతుంది.  గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్‌ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. భారీ తుపాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృత్యువాత పడ్డారు. ఉంపన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు.(బెంగాలీ కుటుంబం.. విషాదాంతం)

మరిన్ని వార్తలు