వైద్యులకు ప్రత్యేక ఆధార్‌: ఎంసీఐ

29 Sep, 2017 02:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : డిజిటల్‌ మిషన్‌ మోడ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వైద్యులకు ఆధార్‌ తరహాలో యునిక్‌ పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ (యూపీఆర్‌ఎన్‌) ఇవ్వాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారు వైద్యులుగా ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. ఇందువల్ల ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ చదివిన వారికి ఆ రాష్ట్రంలో కేటాయించే నంబర్‌.. మరో రాష్ట్రంలో మరొకరికి కూడా ఉంటుంది. ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకే నంబర్‌పై పదుల సంఖ్యలో వైద్యులు ఉంటున్నారు. ఇందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎంసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఎంసీఐ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి యూపీఆర్‌ఎన్‌ నంబర్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. పీజీ, ఆపై ఉన్నత విద్య అభ్యసించాక కూడా ఇదే నంబర్‌పై అప్‌డేట్‌ చేసుకోవచ్చు. కాగా, ఈ విధానం వల్ల ప్రజలు ఇకపై ఏ వైద్యుడి వివరాలు అయినా తెలుసుకోవచ్చు. 

>
మరిన్ని వార్తలు