థర్టీ ఫస్ట్‌ వేడుకలకు ప్రత్యేక లోకల్‌ రైళ్లు

28 Dec, 2017 18:10 IST|Sakshi

సాక్షి, ముంబై: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉప నగరాలు, శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రత్యేక లోకల్‌ రైళ్లు నడపాలని సెంట్రల్, పశ్చిమ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పిల్ల పాపలు, ఇతరు కుటుంబ సభ్యులతో ముంబైకి వచ్చే సందర్శకులకు ఎంతో ఊరట లభించింది.

ఏటా థర్టీ ఫస్ట్‌ రోజున సరదాగా, ఆహ్లాదంగా గడిపేందుకు నగరంలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, మెరైన్‌ డ్రైవ్, చర్చిరోడ్‌ చౌపాటి, సీఎస్‌ఎంటీ, చర్చిగేట్‌ తదితర ప్రాంతాలకు ఉప నగరాలతోపాటు శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారు. డిసెంబరు 31 అర్థరాత్రి 12 గంటలు కాగానే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఆ తరువాత కొద్దిసేపు సంతోషంగా గడిపి తిరిగి ఇళ్లకు తిరుగుముఖం పడతారు. కాని అర్థరాత్రి దాటిన తరువాత లోకల్‌ రైళ్లు ఉండవు. దీంతో తెల్లవారుజాము వరకు ప్లాట్‌పారాలపైనే పడిగాపులు కాయాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ రైల్వే ఎనిమిది, సెంట్రల్‌ రైల్వే నాలుగు ప్రత్యేక లోకల్‌ రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. 

ప్రత్యేక లోకల్‌ రైళ్ల వివరాలు
31వ తేదీన ...
విరార్‌ నుంచి అర్థరాత్రి 12.15, 12.45, 1.40, 3.05 గంటలకు చర్చిగేట్‌కు లోకల్‌ రైలు బయలు దేరుతుంది.
చర్చిగేట్‌ నుంచి 1.45, 2.00, 2.30, 3.25 గంటలకు విరార్‌ దిశగా ఇలా ఎనిమిది లోకల్‌ రైళ్లు నడపనున్నారు.  
సెంట్రల్‌ రైల్వే మార్గంలో సీఎస్‌ఎంటీ నుంచి 1.30 గంటలకు, 
కల్యాణ్‌ నుంచి 1.30 గంటలకు, 
హార్బర్‌ మార్గంలో సీఎస్‌ఎంటీ నుంచి 1.30 గంటలకు, 
పన్వేల్‌ నుంచి 1.30 గంటలకు... ఇలా నాలుగు లోకల్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయి. 

మరిన్ని వార్తలు