హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయం విభజన చట్టంలో లేదని, ఇది హామీ మాత్రమేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. మంగళవారం లోక్సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని ప్రతి హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని సభలో చదవి వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వీలుగా తెలంగాణలోని ముంపు గ్రామాలను ఏపీలో చేర్చామని తెలిపారు. 'ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలని కోరాను. దీన్ని ప్రతిసారీ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో నేనే ప్రస్తావించాను. వాళ్లు అప్పుడు చట్టంలో పెట్టడం మర్చిపోయారు. మాకు మాత్రం ఇప్పటికీ ఆ బాధ్యత గుర్తుంది' అని వెంకయ్య చెప్పారు. ఈ సమయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేచి ఏదో ప్రస్తావిస్తుండగా కనీసం భారతమాతకు వందనం చేయడానికి కూడా మనసొప్పని మీరు.. అంటూ ఆయనపై వెంకయ్య విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు ఏం చేశారు?
ఈ చర్చలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని ఇచ్చాం, ఇన్ని ఇచ్చామని మంత్రి వెంకయ్యనాయుడు చెప్పినప్పుడు, అదే స్థాయిలో తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరారు. తెలంగాణకు ఇస్తామని చెప్పిన వాటిలో ఏ ఒక్కటీ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన జరగడం వల్ల రెండు రాష్ట్రాలూ ప్రభావితమయ్యాయని, అందువల్ల కేంద్రం ఎలాంటి పక్షపాతం లేకుండా రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని ఆయన కోరారు. అసలు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయారు
అంతకుముందు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి తాము ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే, బీజేపీ పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. విభజన జరిగి రెండేళ్లయినా ప్రత్యేక హోదాను మర్చిపోయారని ఖర్గే విమర్శించారు.