గడువు తేదీ చెప్పాల్సిందే

4 Nov, 2017 02:15 IST|Sakshi

ఆధార్‌ అనుసంధానానికి ఆఖరి తేదీపై బ్యాంకులు, టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: బ్యాంకులు, టెలికాం సంస్థలు తమ వినియోగదా రులతో సంప్రదింపుల సమయంలో బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ ఫోన్‌ నంబర్లను ఆధార్‌తో అనుసంధానించుకునే ఆఖరి తేదీ గురించి తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించుకోవ డానికి ఆఖరితేదీ డిసెంబర్‌ 31. మొబైల్‌ నంబర్లను ఆధార్‌తో అనుసంధానించుకోవడానికి చివరి తేదీ 2018 ఫిబ్రవరి 6. ఆధార్‌ చట్టం రాజ్యాంగబద్ధత.. బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించుకోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆధార్‌కు సంబంధించిన అన్ని పిటిషన్లపై ఈ నెలాఖరులో రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఆఖరి తేదీ లేకుండా సందేశాలు పంపొ ద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, టెలికాం సంస్థలను ఆదేశిం చాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం బ్యాంకులు, టెలికాం సంస్థలు పంపే ఎస్‌ఎంఎస్‌ల్లో బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ లింకింగ్‌కు చివరి తేదీలను స్పష్టం చేయాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాలకు డిసెంబర్‌ 31, మొబైల్‌ నంబర్లకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ అని వాటిలో తెలియజేయాలంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట విచారణకు రానున్న ప్రధాన పిటిషన్‌తో పాటు నాలుగు వేర్వేరు పిటిషన్లను సైతం కలిపి రాజ్యాంగ ధర్మాసనం విచారించనున్నట్టు వెల్లడించిన బెంచ్‌.. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు