కోల్‌కతాలో స్పైస్‌జెట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

26 Feb, 2020 16:27 IST|Sakshi

కోల్‌కతా: ముంబై నుంచి గువాహటి వెళ్తున్న స్పైస్‌ జెట్‌ విమానాన్ని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రమంలో అత్యవసరంగా కిందికి దించారు. ఇంధనం లీక్‌ అవుతున్నట్లు పైలట్‌ అనుమానించి బుధవారం ఉదయం కోల్‌కతా విమానాశ్రమం అధికారులకు సమాచారం ఇవ్వడంతో అత్యవసరంగా కిందకు దించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విమానం విమానాశ్రమంలోనే ఉందని, చివరి నివేదిక వచ్చే వరకు విమానం అధికారిక నిర్వహణలోనే ఉంటుందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. విమానంలోని 180 మంది ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దీనిపై కోల్‌కతా విమానాశ్రయం డైరెక్టర్‌ కౌశిక్‌ భట్టచార్య మాట్లాడుతూ.. ‘ఈ స్పైస్‌ జెట్‌ విమాన పైలెట్‌ ఇంధనం లీకేజీ అవుతున్నట్లు అనుమానంగా ఉందని.. విమానాన్ని అత్యవసరంగా దించాలనుకుంటున్నట్టు కోల్‌కతా ఏటీసీకి ఈ ఉదయం 8:45 గంటలకు సమాచారం అందించాడు. దీంతో 8:58కి విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించాం. ఇంధన లీకేజీతో విమానాలను నిలిపివేసిన సంఘటనలు చాలా అరుదుగా జరిగాయి. దీనిపై సివిల్‌ ఏవియేషన్‌ సిబ్బందికి సమాచారం అందిచాము. వారు ప్రయాణీకులందరినీ సురక్షితంగా దించేశారు. ప్రస్తుతం విమానం నిర్వహణలో ఉంద’ని వెల్లడించారు.

మరిన్ని వార్తలు