శ్రీలంక ప్రధానితో మోదీ భేటీ

21 Oct, 2018 01:51 IST|Sakshi

న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే తన భారత పర్యటనలో భాగంగా ప్రధాని  మోదీతో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. మోదీ 2017, మేలో శ్రీలంకకు వెళ్లిన సందర్భంగా ప్రకటించిన పలు ప్రాజెక్టులను మోదీ–విక్రమసింఘే సమీక్షించారు. భారత్‌ ఆర్థిక సాయంతో శ్రీలంకలో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. మోదీ స్పందిస్తూ.. ‘శ్రీలంక ప్రధాని రణిల్‌ను ఢిల్లీలో కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.

ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై మా ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి’ అని ట్వీట్‌ చేశారు. అంతకుముందు హోంమంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో విడివిడిగా విక్రమ సింఘే సమావేశమయ్యారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. భారత నిఘా సంస్థ ‘రా’ తన హత్యకు కుట్ర పన్నుతోందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆరోపించినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చిన నేపథ్యంలో ప్రధాని భారత పర్యటనకు రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు