ప్రపంచానికే ఉదాహరణవుతుంది

13 Feb, 2017 03:12 IST|Sakshi
ప్రపంచానికే ఉదాహరణవుతుంది

మహిళా బిల్లుపై శ్రీశ్రీ రవిశంకర్‌

సాక్షి, అమరావతి: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పాస్‌ అయితే అది ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారుతుందని ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ చెప్పారు. ఈ బిల్లు పాసవుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం ఘాట్‌వద్ద జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సభనుద్దేశించి బెంగుళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ‘రాజకీయాల్లో మహిళలు’ అంశంపై మాట్లాడారు. కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్ని కచ్చితంగా చేసే నైపుణ్యం ఒక్క భారతీయ మహిళకే ఉంటుందన్నారు. రాజకీయాల్లో అయినా.. బ్యూరోక్రసీలో అయినా మహిళల్లో గొప్ప నిర్వహణా సామర్థ్యం ఉంటుందన్నారు. పట్టణ ప్రాంత మహిళలు కొంత ముందుకెళ్లినా గ్రామాల్లో మహిళలకు ఇంకా అవకాశాలు లభించడంలేదన్నారు. ఈ వ్యత్యాసాన్ని పూరించడం కోసం గ్రామీణ మహిళలకు సహకారం అందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

లింగ వివక్ష లేకపోవడమే సాధికారిత: జయసుధ
లింగ వివక్ష లేనప్పుడే నిజమైన సాధికారిత సాధ్యమని సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ చెప్పారు. స్త్రీపురుష సమానత్వం కావాలని అందరూ అంటారని, కానీ అది వాస్తవ రూపం దాల్చే పరిస్థితుల్ని నెలకొల్పాల్సి ఉందన్నారు. ‘రాజకీయాల్లో మహిళలు’ అంశంపై ఆమె మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు, కట్టుబాట్లు పురుషుడికి మహిళలను బానిసగా మార్చాయన్నారు. చట్ట సభల్లో మహిళలు సభ్యులుగా ఉన్నా.. వారి భర్తల జోక్యం ఎక్కువగా ఉంటోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 12 శాతం మంది మహిళలే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, భారత్‌ కంటే సౌదీ అరేబియా వంటి దేశాల్లోనే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందని తెలిపారు.

నిర్ణయాధికారం పొందాలి
మహిళలు అవకాశాలను చేజిక్కించుకోవడంతో పాటు నిర్ణ యాధికారాలు పొందాలి. ప్రపంచంలో సామాజిక సమానత్వం, లింగ వివక్ష ఎక్కువగా ఉంది. మా దేశంలో మహిళల హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం.
– జోయెసె లబొసె, కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌

‘స్థానిక’ మహిళా ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఏదీ?
మహిళలు గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు గా ఎన్నికైన చోట ఆయా మహిళా ప్రజాప్రతినిధి భర్తలే అ«ధికా రాలు చెలాయిస్తున్నారు. మహిళా ప్రజా ప్రతినిధులకు భర్తలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారి పూర్తి సామర్థ్యంతో పనిచేయగల రు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 50 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి.
– పరిటాల సునీత, ఏపీ మంత్రి

ప్రతి తల్లి తమ కొడుకులను స్త్రీ వాదులుగా తీర్చిదిద్దాలి
మహిళా సాధికారిత సాధనలో మొదటి మెట్టుగా ప్రతి తల్లి తమ కొడుకులను స్త్రీవాదులుగా తీర్చిదిద్దాలి. హక్కుల సాధన కోసం జరుగుతున్న ఇలాంటి వేదికలపై వక్తలు ఏం చేయాలన్న దానిపై ప్రసంగాలకు పరిమితం కాకుండా చేసింది చెప్పుకునే పరిస్థితి ఉంటే విజయాలు మనముందే ఉంటాయి.
– వినీషా నీరో, కర్టాటక నామినేటెడ్‌ ఎమ్మెల్యే

ముందు మనిషిగా గుర్తుంచుకోవాలి
ప్రతి ఒక్కరికీ తాను స్త్రీ లేదా పురుషుడు అనే స్పృహ కలిగే ముందు మొదట తాను మనిషి అన్న విషయం గుర్తెరిగి వ్యవహ రించాలి. వ్యక్తి ప్రవర్తన వల్లే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. మరణించిన తర్వాత కూడా తన ప్రవర్తన గురించి ఇతరులు ఉన్నతంగా చెప్పుకోవాలన్న తపన మనిషిని సన్మామార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది.                 
– మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌

90 శాతం విద్యార్థినులకు రక్తహీనత
రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థినుల్లో 90 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తించాను. విజయనగరం జిల్లాలో ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో 130 మంది విద్యార్థినుల రక్తాన్ని పరీక్షిస్తే అందులో 10 మందే రక్తదానం చేయడానికి అర్హులుగా తేలారు. ఆడపిల్ల యుక్త వయస్సులోనే రక్తహీనతతో బాధపడే పరిస్థితి ఉంటే పెళ్లయ్యాక బిడ్డని ఆరోగ్యకరంగా ఎలా కనగలదు!
– మృణాళిని, ఏపీ మంత్రి

ప్రసవ వేదనకన్నా కష్టం ఏముంటుంది..!
ప్రసవ సమయంలో మహిళ అనుభవించే బాధ కన్నా ప్రపంచంలో పెద్ద కష్టం ఏదీ ఉండదు. మహిళలు పెద్ద పెద్ద కలల సాధనలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి ఆడపిల్ల పెద్ద కలలు కని... సవాళ్లను అధిగమించి వాటిని సాకారం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి.
– సలోని సాధన, యువ ఐఏఎస్‌ అధికారిణి

మహిళా బిల్లు ఆమోదానికి ఏకతాటిపైకి రావాలి
జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం రెండు దశాబ్దాలుగా నిరీక్షించాల్సి రావడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మహిళా బిల్లును ఆమోదించేలా ఏకతాటిపైకి రావాలి. పనిచేసే ప్రాంతాల్లో వేధింపులు మహిళలకు తీవ్ర ప్రతిబంధకంగా మారుతున్నాయి. వేదకాలంలో భారతీయ సమాజం మహిళలకు సమున్నత స్థానం కల్పించింది. కానీ మహిళలను ఇంటికి పరిమితం చేసే వివక్షాపూరిత సంప్రదాయం మధ్యయుగాల్లోనే మొదలైంది.     
    – రాజ్‌కుమారీ భట్, రాజస్తాన్‌ బీజేపీ ఎమ్మెల్యే

సదస్సులో బాబు భజనలు
మహిళా పార్లమెంట్‌ సదస్సులో రాష్ట్ర మహిళా మంత్రులు, అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తమకు అవకాశం కలిగించడం వల్లే తాము ఉన్నత స్థాయికి ఎదగామంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మంత్రి పరిటాల సునీత, కిమిడి మృణాళిని, పీతల సుజాత, టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగా తాము ఎమ్మెల్యే, మంత్రులు కాగలిగామంటూ కీర్తించారు.

స్త్రీత్వాన్ని గౌరవిస్తేనే దేశం పురోభివృద్ధి
ప్రముఖ నర్తకి సోనాల్‌ మాన్‌సింగ్‌

స్త్రీత్వాన్ని గౌరవిం చినప్పుడే సమాజం, దేశం పురోభివృద్ధి సాధించగలుగుతాయని ప్రముఖ నర్తకి సోనాల్‌ మాన్‌సింగ్‌ పేర్కొన్నారు. విజయ వాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సు ముగింపు సమావేశంలో ఆమె ప్రసంగించారు. ‘దేశంలోని నగరాల్లో ప్రధాన రోడ్లకు ప్రముఖ నేతల పేర్లు పెట్ట డంతోపాటు ముఖ్య కూడళ్లలో విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటాం. కానీ ఢిల్లీ సహా దేశంలోని ఏ నగరంలోనూ రోడ్లకు మహిళా ప్రముఖుల పేర్లు.. విగ్రహాలూ ఏర్పాటు చేయడమే లేదు. కస్తూరీబాయి గాంధీ, సావి త్రిబాయి పూలే, సరోజినీనాయుడు తదితర మహిళా ప్రముఖులకు తగిన గుర్తింపే లభించడం లేదు’ అన్నా రు.

మహిళలు తాము ఎంచుకున్న రంగాల్లోని ప్రతిబంధకాలు, రాజకీ యాలను ఎదురొడ్డి విజయం సాధించే స్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అందుకు తాము ఎంచుకున్న రంగంపట్ల అవ్యాజ్య మైన ప్రేమ ఉండాలన్నారు. ‘నేను ఓ గవర్నర్‌ మనుమరాలిని. నాట్యంలో రాణిం చాలని భావించాను. అందుకోసం 1963లో ముంబైలోని మా ఇంటిని విడిచిపెట్టి బెంగ ళూరు వచ్చేశాను. నేను ఎంచుకున్న రంగం లో ఎదురైన అన్ని ప్రతిబంధకాలను విజయ వంతంగా ఛేదిస్తూ ప్రయాణం సాగించడం వల్లే  ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోగలిగాను’ అని సోనాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు