ప్రభుత్వంపై పోలీసుల తిరుగుబాటు

7 Jun, 2015 12:28 IST|Sakshi
ప్రభుత్వంపై పోలీసుల తిరుగుబాటు

గువాహటి: అసోంలో సాయుధ బలగాలు తిరుగుబాటు జెండా ఎగరేశాయి. ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం ఆ రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్పీవోలు) చేపట్టిన గువాహటి ముట్టడి కార్యక్రమం హింసాయుతంగా మారింది. తిరుగుబాటును అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులకు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. మరో ముగ్గురు పౌరులుకూడా గాయపడినట్లు తెలిసింది.

అసోం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 840 మంది సాయుధ ఎస్పీవోలు సర్వీసును రెగ్యులరైజ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతులు సమర్పించారు. అవన్నీ బుట్టదాఖలు కావడంతో గువహటిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ను ముట్టడించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలోనే 340 మంది ఎస్పీవోలు శనివారం రాత్రి దిమా హసావో జిల్లా కేంద్రం నుంచి మూడు డంపర్లు, ఒక ట్రక్కులో గువాహటికి బయలుదేరారు. తతిమావారు మార్గం మధ్యలో ర్యాలీలో చేరారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు తిరుగుబాటుదారుల్ని గువాహటిలోకి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 'ఆందోళన విరమించాలనే తమ అభ్యర్థనను ఎస్సీవోలు పెడచెవినపెట్టి కాల్పులకు దిగారని, బదులుగా తాము కూడా కాల్పులు జరపవలిసి వచ్చిందని అసోం ఐజీ(లా అండ్ ఆర్డర్) ఎస్ ఎన్ సింగ్ మీడియాకు చెప్పారు. కాల్పుల్లో ఇద్దరు ఎస్పీవోలు సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారని చెప్పారు.

జాతీయ రహదారుల్లోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకోసం అసోం ప్రభుత్వం 2008లో వందలమంది ఎస్పీవోలను అద్దె ప్రాతిపతికన నియమించుకుంది. ఏళ్లుగా తమతో రకరకాల సేవలు చేయించుకుంటున్న ప్రభుత్వం.. జీతభత్యాలు, సర్వీసు క్రమబద్ధీకరణ విషయాల్లో తమకు అన్యాయం చేస్తోన్నదని ఎస్పీవోలు ఆగ్రహంతో ఉన్నారు. గతేడాది సెప్పెంబర్లోనూ ఎస్పీవోలు ఇదే తరహా తిరుబాటుకు ప్రయత్నించడం, పోలీసులు దానిని అణిచివేయడం గమనార్హం. కాగా, తాజా తిరుగుబాటును తీవ్రంగా పరిగణిస్తున్నామని, అందులో పాలుపంచుకున్న ఎస్పీవోలందరినీ చట్టపరంగా శిక్షిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు