వలస కూలీల కోసం రూ.1,000 కోట్లు విడుదల

23 Jun, 2020 13:34 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. కరోనాతో పోరాడటానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 50,000 ‘మేడ్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లను సరఫరా చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎమ్‌-కేర్స్ ఫండ్ నుంచి రూ .2,000 కోట్లు విడుదల చేసింది. అంతేకాక ఇప్పటివరకు 2,923 వెంటిలేటర్లను తయారు చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో ఇప్పటికే 1,340 వెంటిలేటర్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు ప్రకటించింది. వీటిలో మహారాష్ట్ర, ఢిల్లీలు కూడా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలోనే అత్యధిక కరోనా కేసులు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాలకు 275 చొప్పున వెంటిలేటర్లు పంపించినట్లు కేంద్రం తెలిపింది. ఇతర ప్రభావిత రాష్ట్రాలు గుజరాత్‌కు 175, బిహార్‌కు 100, కర్ణాటకకు 90 మరియు రాజస్థాన్‌కు 75 చొప్పున వెంటిలేటర్లు పంపినట్లు వెల్లడించింది.
('50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి')

అంతేకాక వలస కూలీల సంక్షేమం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 1,000 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిధి వలస కూలీలకు వసతి, ఆహారం, వైద్య చికిత్స, రవాణా ఏర్పాట్ల కోసం ఉపయోగించాలని సూచించింది. దీనిలో అత్యధిక మొత్తాన్ని మహారాష్ట్రకు రూ. 181 కోట్లు, ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌కు రూ. 103 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత తమిళనాడుకు రూ. 83 కోట్లు, గుజరాత్‌కు రూ. 66 కోట్లు, ఢిల్లీకి రూ. 55 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 53 కోట్లు, బిహార్‌కు రూ. 51 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 50 కోట్లు, రాజస్థాన్‌కు రూ. 50 కోట్లు, కర్ణాటకకు రూ. 34 కోట్లు కేటాయించింది. (భారత్‌కు చేరిన అమెరికా వెంటిలేటర్లు)

కరోనా వైరస్‌ కట్టడి కేంద్రం రాష్ట్రాలకు సహాయం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు వివిధ ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు