భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ప్రతీక

29 Oct, 2018 05:43 IST|Sakshi

‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’పై ఎల్‌అండ్‌టీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’(ఐక్యతా విగ్రహం) కేవలం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌కి మాత్రమే ఘన నివాళే అని కాకుండా భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యాలకూ గొప్ప ప్రతీక అని నిర్మాణరంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ పేర్కొంది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన చైనా స్ప్రింగ్‌ దేవాలయాల్లో ఉన్న బుద్ధ విగ్రహం (153 మీ.) నిర్మాణానికి 11 ఏళ్లు పడితే..ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేస్తూ ఎల్‌అండ్‌టీ ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ని కేవలం 33 నెలల్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించింది. విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ (93 మీ.) కంటే ఇది రెట్టింపు ఎత్తు ఉంటుంది. రూ.2,989 కోట్లతో నిర్మితమైన ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ని అక్టోబర్‌ 31న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ  స్టాట్యూను 5 జోన్లుగా విభజించారు. మొదటి జోన్‌లో మెమోరియల్‌ గార్డెన్, మ్యూజియం, రెండో జోన్‌లో 149 మీ. విగ్రహమే ఉంటుంది. మూడో జోన్‌లో 153 మీ. వరకు గ్యాలరీ, నాలుగో జోన్‌లో మెయింట నెన్స్‌ ఏరియా, ఐదో జోన్‌లో పటేల్‌ భుజాలు, తల ఉంటుందని ఎల్‌అండ్‌టీ పేర్కొంది. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు.

మరిన్ని వార్తలు