► కల్లోల కశ్మీరంలో అమాయకుల బలి
► వేర్పాటువాదులు, భద్రతా బలగాలకు మధ్య సమిధలుగా సామాన్యులు
అది జమ్మూకశ్మీర్లోని బందీపుర జిల్లాలోని అష్టెంగో గ్రామం. శుక్రవారం ఉదయం పక్కపక్కనే రెండు సమాధులు సిద్ధమయ్యాయి. ఒకటి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన పోలీసు కానిస్టేబుల్ కోసం.. మరొకటి రాళ్లు రువ్వుతుండగా భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో మరణించిన భవననిర్మాణ కార్మికుడి కోసం. కొద్ది గంటల తేడాతో ఇద్దరి ఖననం పూర్తయ్యింది.
ఇద్దరూ అమరులే. ఒకరు ప్రభుత్వం దృష్టిలో, మరొకరు స్వాతంత్య్రం కోరుతున్న కశ్మీరీల దృష్టిలో. సాయంత్రానికి ఆ గ్రామంలో శ్మశాన నిశ్శబ్దం. ప్రతి ఒక్కరి గుండెల్లో ఆవేదన. ఇంకెన్నాళ్లీ మృత్యుఘోష? ఇది ఒక అష్టెంగో ప్రశ్న కాదు... సగటు కశ్మీరీ ప్రశ్న. వేర్పాటువాదులకు, భద్రతాబలగాలకు మధ్య పోరులో ఆప్తుల్ని పోగొట్టుకున్న ఎందరో అమాయకుల ప్రశ్న. కశ్మీర్లో ఇలాంటి గ్రామాలెన్నో..
నా కుమారుడు చేసిన తప్పేంటి?
నసీర్ అహ్మద్ ఉపాధి కోసం అష్టెంగో నుంచి శ్రీనగర్కు వెళ్లాడు. భద్రతాబలగాలు, అల్లరి మూకల మధ్య కాల్పుల్లో ఆ మార్గం మీదుగా వెళ్తోన్న నసీర్ గాయపడ్డాడు. తండ్రి గులామ్కు విషయం తెలియగానే శ్రీనగర్ బయలుదేరారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నసీర్ రాత్రి 1.30 ప్రాంతంలో మరణించాడు. ‘అది వినగానే నా ప్రాణం పోయింది.
నా ఆత్మ నన్ను వీడింది. బిడ్డతో కడసారి ఒక మాటన్నా మాట్లాడలేక పోయా’ అని కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు గులామ్. ఇంతలోనే ఆగ్రహంతో ‘ఎవరో రాళ్లు విసిరితే మరెవరో మూల్యం చెల్లించారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకుంటారు. నా కుమారుడు చేసిన తప్పేంటి? వాడొక అమాయకుడు. నేనిక భారత్ను క్షమిస్తానా?’ అని ప్రశ్నించాడు.
నాన్న ఎక్కడ అని అడిగితే..?
గ్రామంలోని మసీదు అవతలివైపు కానిస్టేబుల్ షాజాద్ దిలావర్ సోఫీ ఇంటివద్ద కూడా విషాదఛాయలు. శ్రీనగర్లోని హైదర్పురా ప్రాం తంలో పోలీసులపైకి కశ్మీరీ మిలిటెంట్ల కాల్పుల్లో సోఫీ మరణించారు. ‘ఇక్కడి ప్రజలు ఎందుకు చావాలి?’ అని ప్రశ్నించారు సోఫీ బంధువు అబ్దుల్ ఖయ్యూం. నసీర్ తండ్రి గులామ్ స్పందిస్తూ..
‘అతను చేసిన తప్పేంటి? భారత యూనిఫారం వేసుకోవడమా?, ఏం జరిగినా చివరకు పోయేది కశ్మీరీ ప్రాణమే’ అని చెప్పారు. సోఫికి గత ఏడాదే పెళ్లయింది. ఇద్దరు కవల పిల్లలు. అయితే వారు ఎదిగాక.. నాన్న ఎక్కడని అడిగితే ఎవరు సమాధానం చెబుతారు?.. ఇలా ఎన్నో కుటుం బాల్లో అంతులేని ఆవేదనలు..
27 ఏళ్లలో 40 వేల మంది మృతి
గత 27 ఏళ్లలో కశ్మీర్ సమస్య వల్ల 40,000 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం లెక్క తేల్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్టీఐ దరఖాస్తుకు జవాబిస్తూ 1990 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 13,941 మంది పౌరులు మరణించగా.. భద్రతా బలగాలు 21,695 మంది తీవ్రవాదుల్ని హతమార్చాయి. మిగతా వారు సైనికులు, పోలీసుల’ని పేర్కొంది. వాస్తవంగా మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని స్వచ్చంద సంస్థలు, హక్కుల సంఘాల వాదన. 2001లో అత్యధికంగా 3,552 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పౌరులు 996 మంది, భద్రతాబలగాలకు చెందిన వారు 536 మంది, తీవ్రవాదులు 2,020 మంది.
సమాధిలో మొదటిరోజు..
‘సమాధిలో మీరు, కటిక చీకటిలో ఒంట రిగా.. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నిం చుకున్నారా... సమాధిలో తొలిరాత్రి నాకే మవుతుందని? అంతిమయాత్ర కోసం మీ పార్థివదేహానికి స్నానం చేయిస్తున్న క్షణాన్ని ఊహించుకోండి. కుటుంబీకులు రోదిస్తుం డగా... జనం మీ పార్థివదేహాన్ని మోస్తున్న రోజును ఊహించుకోండి’ ఇది 2013 జన వరి 18న సబ్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ అహ్మద్ దార్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు. కశ్మీరంలో శాంతి నెలకొనాలని ఎంతో తాపత్రయ పడ్డాడు. శుక్రవారం మిలిటెంట్ల దాడిలో ఫిరోజ్ అహ్మద్(32) మరణించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్