ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు..!

20 May, 2020 15:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘కబ్‌ దమ్‌ తోడ్‌ దే ఇస్కా కోయి బరోసా నహీ హై (ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు)’ అని 30 ఏళ్ల భాయియా రాయ్‌దాస్‌ తాత్వికంగా ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా నుంచి వలస వచ్చిన రాయ్‌దాస్‌ ఢిల్లీలో రోజువారి కూలీపై బతుకుతున్నారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన తల్లి చివరి దశలో ఉందట. 28 ఏళ్ల ఆయన భార్యకు ఎనిమిదో నెల కడుపుతో ఉందట. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మూడవ సారి పొడిగించడంతో తల్లి ఆఖరి చూపు కోసం, ప్రసవ సమయంలో ఉన్న భార్య పక్కనుండడం కోసం సొంతూరుకు వెళ్లాలని రాయ్‌దాస్‌ నిశ్చయించుకున్నారు.

ఆయన ఢిల్లీలోనే ఉంటున్న తన సోదరి సుధా సాకేత్, ఆమె భర్త రవి కుమార్, వారిద్దరి పిల్లలతో కలిసి సొంతూరుకు కాలి నడకన బయల్దేరారు. వారు ఐదుగురు కలిసి రాత్రంగా నడుస్తూ 26 కిలోమీటర్లు నడిచి ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ వారిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నిలిపివేశారు. బస్సులో తప్పించి,  కాలి నడకన, టూ వీలర్లపై తమ రాష్ట్రం గుండా వెళ్లేందుకు అనుమతించమంటూ యూపీ పోలీసులు వారిని స్పష్టంగా హెచ్చరించారు. వారిలా అక్కడ కొన్ని వందల మంది నిలిచిపోయారు. చేసేదేమీ లేక రాయ్‌దాస్‌ ఢిల్లీ నుంచి బస్సుగానీ, లారీగానీ వస్తుందేమోనంటూ ఎదురు చూడడం ప్రారంభించారు. బుధవారం ఉదయం వరకు ఎలాంటి వాహనం రాలేదు.

అలా యూపీ సరిహద్దుల్లో చిక్కుకు పోయిన వందలాది వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. అయినవారి ఆఖరి చూపుకోసమంటూ కొందరు బయల్దేరితో, సొంతూరికి చేరుకుంటే కలోగంజో తాగి బతకొచ్చనుకుంటూ వచ్చిన వారే వారందరు. వారు సామాజిక కార్యకర్తలు పంచుతున్న బిస్కట్లు, బ్రెడ్లు, పండ్లు తింటూ, మంచినీళ్లు తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. (భారత్‌ నుంచి 12 లక్షల కోట్లు వెనక్కి)

మరిన్ని వార్తలు