అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వెంటిలేటర్

9 Apr, 2020 12:42 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, చెన్నై : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది, శరవేగంగా విస్తరిస్తూ వేలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది. మరోవైపు రోగులకు అందిస్తున్న చికిత్స లో కీలకమైన వెంటిలేటర్ల తీవ్ర కొరత మరింత ఆందోళన రేపుతోంది. ఈ సమయంలో అతితక్కువ ఖరీదుకే తయారు చేస్తామని ఒక స్టార్టప్ సంస్థ చెబుతోంది. అంతేకాదు దేశ, విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి వుందని చెబుతున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విద్యార్థి-స్టార్టప్ జేకే దజ్తా సిస్టమ్స్ దీన్నిఅభివృద్ధి చేసింది. అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ వెంటిలేటర్ ప్రాజెక్ట్ ఆధారంగా, రీ-ఇంజనీరింగ్ డిజైన్‌తో తాము ఈ వెంటిలేటర్‌ను తయారుచేసినట్లు జేకే దజ్తా సిస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 22న ప్రాజెక్టును ప్రారంభించిన తాము కేవలం నాలుగు రోజుల్లోనే ఒక నమూనాతో ముందుకు వచ్చామని పేర్కొంది.  స్థానిక ఈఎస్ఐ  ఆసుపత్రి అనుమతితో పాజిటివ్ ప్రెజర్ బ్రీతింగ్ వెంటిలేటర్ (ఐపీపీవీ) ఇప్పుడు పరీక్షకు సిద్ధంగా ఉందని చెప్పారు. తాము రూపొందించిన ఈ కొత్త పరికరం దేశవిదేశాల్లో వెంటిలేటర్లకున్న భారీ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. అన్ని ఎలక్ట్రానిక్ ఫీచర్లతో, కొత్తగా రీడిజైన్ చేసిన వెంటిలేటర్ల నమూనాను కేవలం రూ.25 వేల కన్నా తక్కువ ధరకే అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని త్వరలోనే ఇక్కడి ప్రభుత్వ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో పరీక్షించనున్నామని చెప్పారు. రాతినం కాలేజీకి చెందిన బయో మెడికల్, కంప్యూటర్ సైన్స్ విభాగం సహకారంతో కార్తీక్ ఎస్, గౌతమ్, సంతకుమార్ బృందం ఈ వెంటిలేటర్ రూపకర్తలు.

టైడల్ వాల్యూమ్, నిమిషంలో తీసుకునే శ్వాస రేటు, తదితర అన్ని వివరాలను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తుందన్నారు. దీంతోపాటు రోగికి అందుతున్న ఆక్సిజన్ స్థాయిలను కూడా పర్యవేక్షించేలా మెరుగుపర్చినట్టు తెలిపారు. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో తయారు చేసిన ఈ వెంటిలేటర్ చాలా మంది రోగులకు సహాయం చేస్తుందని ఆశాభావం ఈ బృందం  వ్యక్తం చేసింది. పరీక్షల అనంతరం అధిక సంఖ్యలో వాణిజ్య ఉత్పత్తి కోసం ప్రభుత్వ లైసెన్స్ తీసుకుంటాని తెలిపింది.

మరిన్ని వార్తలు