బడి ఎగ్గొట్టి మరీ బాగుచేశారు

15 Jan, 2020 03:40 IST|Sakshi

ఔరంగాబాద్‌: రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో మహారాష్ట్రలోని ఓ గ్రామానికి ఉన్న బస్సు సౌకర్యం రద్దయింది. దీంతో స్వయంగా విద్యార్థులే ఓ రోజు బడికి డుమ్మా కొట్టి రోడ్డు బాగుచేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఔరంగాబాద్‌ జిల్లా ధమన్‌గావ్‌రాజూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. ధమన్‌గావ్‌రాజూర్‌కు 2019లో ముఖ్యమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన పథకం కింద 18 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి, మధ్యలోనే వదిలేశారు.

అయితే ధమన్‌గావ్‌రాజూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దభాదీ గ్రామంలో స్కూలు ఉంది. ఆ స్కూల్లో ధమన్‌గావ్‌ రాజూర్‌ పిల్లలు చదువుకుంటున్నారు. అయితే రోడ్డు సరిగా లేక గతేడాది డిసెంబర్‌లో ఆ గ్రామానికి బస్సు సౌకర్యం  నిలిచిపోయింది. దీంతో ధమన్‌గావ్‌రాజూర్‌ విద్యార్థులు స్కూలుకు నడిచి వెళ్తున్నారు. రోజుకు రెండు గంటలపాటు నడకతోనే వారికి సరిపోతోంది. దీంతో విద్యార్థులు ఈ నెల 10న స్కూలు మానేసి కిలోమీటర్‌ మేర రోడ్డును బాగుచేసుకున్నారు. ‘ఈ రోడ్డును పూర్తిస్థాయిలో మార్చి నాటికి సిద్ధం చేస్తాము’అని రోడ్డు కాంట్రాక్టర్‌ వైకే దేశ్‌ముఖ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు