ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఊరట

30 Nov, 2018 19:25 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై రూ.6.52 మేర తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం 14.2కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.507.42గా ఉంది. 7 రూపాయలు తగ్గడంతో సిలెండరు ధర రూ.500.90కి లభించనుందని ఐఓసీ వెల్లడించింది. రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఎల్‌పీజీ ధరలు భారీగా తగ్గినట్లు ఐఓసీ వెల్లడించింది. ఇక సబ్సిడీయేతర సిలెండరు ధరపై రూ.133 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు సబ్సిడీయేతర సిలెండరు ధర రూ.942.50గా ఉంది. ఇక మీదట ఢిల్లీలో సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలెండరు ధర రూ.809.50కి లభించనుంది.

ఈ ఏడాది జూన్‌ నెల నుంచి ఎల్‌పీజీ ధర పెరుగుతూనే వచ్చింది. ఇప్పటి వరకు ఆరుసార్లు వంట గ్యాస్‌ ధరను పెంచారు. ఈ ఆరు నెలల కాలంలో గ్యాస్‌ ధర రూ.14.13 మేర పెరిగింది. గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఏటా 12 సిలెండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సబ్సిడీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. నవంబరు నెలలో చివరి సారిగా వంట గ్యాస్‌ సిలెండరు ధర పెంచారు.

>
మరిన్ని వార్తలు