మిస్‌ ఇండియాగా సుమన్‌ రావ్‌

17 Jun, 2019 03:44 IST|Sakshi
సుమన్‌రావుకు కిరీటాన్ని అలంకరించిన 2018 మిస్‌ ఇండియా అనుకీర్తి వాస్‌, సెకండ్‌ రన్నరప్‌తో తెలంగాణ అమ్మాయి సంజన (ఎడమ)

తెలంగాణకు చెందిన సంజనా మిస్‌ ఇండియా రన్నరప్‌

ముంబై: రాజస్తాన్‌కు చెందిన సీఏ విద్యార్థిని మిస్‌ ఇండియా–2019 విజేతగా నిలిచారు. ముంబైలోని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. పరిస్థితులు ఎప్పటికీ చేజారవని, తనలాగే కలలు కంటున్న ఇతర మహిళలు భయపడకుండా కలలను సాకారం చేసుకోవచ్చన్న నమ్మకం ఈ టైటిల్‌ అందుకోవడం ద్వారా కలిగిందన్నారు. తన కుటుంబం, మిత్రులతో సంబరాలు జరుపుకోవడానికి వేచి ఉండలేకపోతున్నానని అన్నారు. డిసెంబర్‌లో బ్యాంకాక్‌లో జరుగనున్న మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కూడా పాల్గొననున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇంజినీర్‌ శివాని జాదవ్‌ మిస్‌ గ్రాండ్‌ ఇండియాగా నిలిచారు. బిహార్‌కు చెందిన మేనేజ్‌మెంట్‌ విద్యార్థిని శ్రేయా శంకర్‌ మిస్‌ ఇండియా యునైటెడ్‌ కాంటినెంట్స్‌గా నిలిచారు. తెలంగాణకు చెందిన సంజనా విజ్‌ మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. ప్రముఖ డిజైనర్‌ ద్వయం ఫాల్గుని షేన్‌ పీకాక్, మిస్‌ వరల్డ్‌ 2018 వెనెస్సా పొన్కా డి లియోన్, నటులు హుమా ఖురేషి, చిత్రాంగ సింగ్, ఆయుష్‌ శర్మ, కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత రెమో డి సౌజా, స్ప్రింటర్‌ ద్యుతి చంద్, ఫుట్‌బాల్‌ టీం కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రితో కూడిన బృందం విజేతలను ఎంపిక చేసింది.

ఎంటెక్‌ చదువుతున్న సంజన...
తెలంగాణకు చెందిన సంజనా విజ్‌ మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. దీనితోపాటు మిస్‌ తెలంగాణ 2019 టైటిల్‌ను అందుకున్నారు. ఈమె యూపీలోని అమితీ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో ఎం.టెక్‌ చదువుతున్నారు.
 

మరిన్ని వార్తలు