జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వండి

18 Jul, 2016 06:49 IST|Sakshi
జీఎస్టీ బిల్లుకు మద్దతివ్వండి

అఖిలపక్ష భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి
 
- ఎన్ని సమస్యలున్నా జాతీయ ప్రయోజనాలే మిన్న
పార్టీల సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్న ప్రధానమంత్రి
- లిఖిత పూర్వక వివరణ అందితేనే జీఎస్టీ బిల్లుకు మద్దతు: కాంగ్రెస్
- నేటి నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు
 
 సాక్షి, న్యూఢిల్లీ : ‘అన్ని సమస్యలను పక్కనపెట్టండి.. జాతీయ ప్రయోజనాలనే మిన్నగా భావించండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు మద్దతివ్వాలని ఆయన అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మనం ప్రజలకు, రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.అందువల్ల మిగిలినవన్నీ పక్కనపెట్టి జాతీయప్రయోజనాలే మిన్నగా భావించాలి’’ అని ప్రధాని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ ప్రసంగించారు.  జీఎస్టీ బిల్లు సహా పలు కీలకబిల్లులు ఈ సమావేశాలలో ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని స్వయంగా విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

 అర్థవంతమైన చర్చలు జరగాలి
 జీఎస్టీ బిల్లుతో పాటు అనేక ముఖ్యమైన బిల్లులను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని, ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిగి సమావేశాలు ఫలప్రదమవుతాయని ఆశిస్తున్నానని ప్రధాని చెప్పారు. జీఎస్టీ బిల్లు గురించి ప్రధాని ప్రస్తావిస్తూ ‘ఏ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందన్నది ప్రధానం కాదు. కానీ బిల్లు పాసవడం ముఖ్యం..’ అని పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి వివిధ పార్టీలు చేసిన సూచనలను, సలహాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో ఇటీవలి పరిణామాలపై రాజకీయ పార్టీలు స్పందించిన తీరును మోదీ అభినందించారు.

‘కశ్మీర్ సంఘటనలపై విభిన్న రాజకీయ పార్టీలు ఒక్కతాటిపై నిలిచి చేసిన ప్రకటనలు దేశానికి వన్నె తెచ్చాయి. ఈ ప్రకటనలు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాయి. అన్ని పార్టీలకూ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఉద్రిక్తతలపై పార్లమెంట్‌లో చర్చించాలని, ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. గవర్నర్‌ల పాత్ర అంశంపైనా చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి.  మరోవైపు, సమావేశాల తొలిరోజు లోక్‌సభ మధ్యప్రదేశ్ ఎంపీ దల్‌పత్ సింగ్ అకాల మృతికి సంతాపం తర్వాత వెంటనే వాయిదా పడే అవకాశం ఉంది.

 వివరణలు అందితేనే: కాంగ్రెస్
 ‘ప్రాధాన్యతా క్రమంలో బిల్లులకు మద్దతిస్తాం కానీ జీఎస్‌టీ బిల్లుపై హామీ ఇవ్వలేం’ అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. జీఎస్టీ బిల్లుకు సంబంధించి తాము లేవనెత్తిన ఆందోళనలపై లిఖితపూర్వకమైన వివరణ ఇచ్చిన తర్వాత మాత్రమే దీనిపై తాము ఒక వైఖరి తీసుకోగలుగుతామని ఆ పార్టీ పేర్కొంది. ఇతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలను అస్థిరపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ ఆజాద్ అరుణాచల్ పరిణామాలను ఉదహరించారు. తాము అన్ని బిల్లులకు ప్రాధాన్యతా క్రమంలో మద్దతిస్తామని ఆజాద్ చెప్పారు.

 అన్ని పార్టీలతో చర్చించాలి: సీపీఎం, ఎస్పీ
 బీజేపీ, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ ఆరోపించారు. ప్రభుత్వం అన్ని పార్టీలతోనూ చర్చించాలని డిమాండ్ చేశారు. మరికొందరు ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ సమావేశాలను పొడిగించాలని కోరారు.

 అఖిలపక్షం సఫలం: అనంత్‌కుమార్
 ‘సమావేశం ఫలప్రదమైంది. పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ అన్నారు. అఖిలపక్ష సమావేశాం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ‘కాంగ్రెస్ బిల్లుల్లోని అంశాలను బట్టి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. జీఎస్టీపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం’ అని అన్నారు. భేటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఎస్‌ఎస్ అహ్లూవాలియా ఇంకా 30 పార్టీల నుంచి 45 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

 జీఎస్టీపై ఏకాభిప్రాయం: వెంకయ్య
 జీఎస్టీ బిల్లుపై అఖిలపక్షంలో ఏకాభిప్రాయం వచ్చిందని, ఈ సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. పన్నురేటుకు పరిమితి ఉండాలన్న కాంగ్రెస్ డిమాండ్ అమలుచేయదగినది కాదన్నారు.
 
 అస్త్రశస్త్రాలతో విపక్షం సిద్ధం
 సాక్షి, న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.అరుణాచల్ ప్రదేశ్ పరిణామాలు, కశ్మీర్‌లో అశాంతి, రాష్ట్రాలలో వరదలు, ఉగ్రవాద సమస్య, విదేశాంగవిధానం తదితర అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. అణు సరఫరాదేశాల కూటమిలో సభ్యత్వం సంపాదించడంలో విఫలం కావడంపైనా చర్చకు పట్టుబట్టనున్నాయి. సమావేశాలు ఈనెల 18 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 20 రోజుల పాటు పార్లమెంటు  సమావేశమవనుంది. భారత వైద్య మండలి (సవరణ) ఆర్డినెన్స్, 2016, బాలకార్మికుల (నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంపై యూపీఏ తెచ్చిన బిల్లును మార్పులతో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
 
 జీఎస్టీ అంటే..?
 వస్తు సేవల పన్ను (జీఎస్టీ).. రెండేళ్లుగా పార్లమెంట్ సమావేశాలు వచ్చిన ప్రతిసారీ తెరపైకి వస్తోంది. దేశవ్యాప్తంగా వస్తువులు, సేవలకు ఒకే పన్ను విధించడంతో పాటు పన్నుపై పన్ను విధించే పద్ధతికి స్వస్తి పలికేందుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను(వ్యాట్), వినోద, విలాస, ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ మొదలైన వాటి స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. జీఎస్టీ పరిధి నుంచి మద్యాన్ని పూర్తిగా తప్పించారు. పెట్రోల్, డీజిల్ లాంటి పెట్రోలియం ఉత్పత్తులు వ్యవస్థలో భాగంగా ఉంటాయి. జీఎస్టీ అమలయ్యే క్రమంలో రాష్ట్రాలు రాబడి కోల్పోయే సూచనలు ఉంటే... నష్ట పరిహారంగా మొదటి మూడేళ్లలో వంద శాతం, నాలుగో ఏట 75 శాతం, ఐదో ఏట 50 శాతం చెల్లించనుంది. పెట్రోలియం ఉత్పత్తులు బిల్లులో భాగంగా ఉన్నా వాటిపై ఎలాంటి పన్నులు విధించరు. దీంతో రాష్ట్రాలు వాటిపై వ్యాట్ కొనసాగించవచ్చు.

>
మరిన్ని వార్తలు