రేపే అయోధ్యపై తీర్పు

8 Nov, 2019 21:23 IST|Sakshi

అయోధ్యపై తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పు వెలువరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిద్ధమైంది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించనుంది. కాగా తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇదివరకే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది.

అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైనదిగా భావిస్తోన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు ఇదివరకే సూచించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పులో స్పందించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసింది. తీర్పు వెలువడిన తరువాత దానికి వ్యతిరేకంగా, సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు