సాక్షి, న్యూఢిల్లీ : పెళ్లి పేరుతో మహిళను లోబరుచుకోవడం లైంగిక దాడిగా పరిగణించాలని, ఇది మహిళ గౌరవానికి భంగకరమేనని సర్వోన్నత న్యాయస్ధానం సంచలన తీర్పు వెలువరించింది. చత్తీస్గఢ్కు చెందిన ఓ డాక్టర్ 2013లో్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించిన కేసులో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీం బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడైన డాక్టర్తో విలాస్పూర్కు చెందిన బాధితురాలికి 2009 నుంచి పరిచయం ఉంది.
వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండగా పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు బాధితురాలిని వంచిస్తూ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడిని చత్తీస్గఢ్ హైకోర్టు లైంగిక దాడిలో దోషిగా తేల్చింది. హైకోర్టు నిందితుడికి పదేళ్ల కఠిన శిక్షను విధించడంతో నిందితుడు కింది కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కాగా, బాధితురాలిని వివాహం చేసుకునే ఉద్దేశం నిందితుడికి లేకున్నా ఆమెను శారీరకంగా లోబరుచుకునేందుకు పెళ్లిని సాకుగా చూపాడని, ఇది లైంగిక దాడి కిందకే వస్తుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అదే నేరం కింద శిక్షను అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పింది.